తిరువనంతపురం లో పార్కింగ్ నిషేదించిన చోట కారు నిలిపాడని నెయ్యంతికర డీఎస్పీ హరికుమార్ ఓ వ్యక్తిని నెట్టేసి అతని మృతికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్ హరికుమార్ను విధుల నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించారు కూడా. అయితే, 34 ఏళ్ల సనాల్ మృతికి కారణమైన హరికుమార్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. కల్లంబాల్లంలోని ఓ ఇంటిలో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించారు. కాగా, ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా లేక ఆత్మహత్యా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే సనాల్ మృతి చెందినప్పటి నుంచి పరారీలో ఉన్న హరికుమార్ను పట్టుకునేందుకు పోలీసులు వెతుకుతున్నారు. కేరళతో పాటు తమిళనాడులో సైతం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, హరికుమార్ను ఈ కేసు నుంచి తప్పించేందుకు అధికార కమ్యూనిస్టు పార్టీ యత్నిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పించాయి. నిందితున్ని పట్టుకోవడంలో కావాలనే జాప్యం చేస్తోందని పోలీసు శాఖపై ఆరోపణలు చేశాయి. సనాల్ మృతి అనంతరం డీఎస్పీ హరికుమార్ పారిపోయేందుకు సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. డిఎస్పీ మృతి పై ఇంకా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.