కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకుడు మల్యాద్రి రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాషాయం కండువా కప్పి మల్యాద్రిని పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం సభలో ప్రసంగించిన బండి సంజయ్ మన దేశం నుంచి తప్పించుకుని పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ కోర్టు భారత్ కు అప్పగించేందుకు అంగీకరించిందని అన్నారు.
అయితే దేశాన్ని దోచుకున్న దొంగలు లండన్లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఫాంహౌస్లో ఉన్నా వదిలిపెట్టబోమని అన్నారు. కేంద్ర పథకాలను టీఆర్ఎస్ తమ ప్రభుత్వ పథకాలుగా చెప్పుకుంటుందని, సీఎం కేసీఆర్ నోరు విప్పితే అబద్ధాలే చెబుతారని బండి సంజయ్ ఆరోపించారు. ఇక బాన్సువాడలో పోచారం ఇద్దరు కుమారులు ఇసుక, కంకర దందాలో దోచుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రామ రాజ్యం రావాలంటే రాముడు లాంటి వారికి అవకాశం ఇవ్వాలని అన్నారు.