తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గ్రేటర్ ప్రచారంలో భాగంగా వీరిద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ 505 సెక్షన్ కింద SR నగర్ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
పాతబస్తీలో రోహింగ్యాలు నివసిస్తున్నారని, వారిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బండి సంజయ్ ప్రకటించడం, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అక్రమ నిర్మాణాలపై మాట్లాడుతూ ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చలని డిమాండ్ చేయడం, పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూలిస్తే రెండు గంటల్లోగా నీ దారుసలాంను కూల్చేస్తామని బండి సంజయ్ సవాల్ విసరడం వంటి వ్యాఖ్యలతో సామాజికంగా ఘర్షణలు చెలరేగే అవకాశాలున్నాయని అందుకే వీరిపై కేసులు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు.