కరోనా పరిస్థితులను బట్టి ప్రతి నెలా సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్రం, అక్టోబర్ నెల ముగుస్తుండడంతో అన్లాక్ 6 పేరిట కొత్త గైడ్లైన్స్ విడుదల చేస్తారని అనుకున్నప్పటికి అది జరగలేదు. అన్లాక్ 5లో భాగంగా ప్రకటించిన సడలింపులను నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
అయితే అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు కేంద్రం అనుమతించినా, దీనిపై ఆయా రాష్ట్రాలు, విద్యాసంస్థలే నిర్ణయం తీసుకోవాలని ఇదివరకే సూచించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో తెరుచుకోగా, మరొకొన్ని రాష్ట్రాలలో తెరిచేందుకు వెనకాడుతున్నారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.